అంతస్సారం

Posted on నవంబరు 3, 2009. Filed under: వ్యక్తిత్వ వికాసం | Tags: , , , , , , , , , , , , , , , , , , , , , , , , |

రాజ్యాధిపతులు కావడానికీ ఉన్నత పదవుల్లోకి వెళ్లడానికీ పెద్ద తేడా లేదు. ఈనాటి యువత చిన్నప్పటి నుండీ స్పర్ధాస్ఫూర్తితో ఉన్నత పదవులను ఆశిస్తూ విద్యాకృషి చేస్తున్నారు. అది మంచిదే. కానీ ఉన్నత పదవులను కోరేవారు ఎలాంటి అంతస్సారాన్ని అలవర్చుకోవాలో తెలుసుకోవాలి. ఇందుకు భగీరథ చక్రవర్తి జీవితంలో ఒక సన్నివేశం ఉపయోగపడుతుంది.

గంగను భూమిపైకి తెచ్చిన భగీరథుని కథ అందరికీ‌ తెల్సినదే. ఈ భగరథుడు అయోధ్యానగరానికి రాజు, చక్రవర్తిగా చక్కని పరిపాలన చేశాడు. ఆయనలో ఉన్న అసలైన అంతస్సారం తెలియాలంటే గంగావతారణానికి తరువాత జరిగిన  కథ ఒకటి తెలుసుకోవాలి. ఆ చక్రవర్తి రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు ఆయన పరమాత్మను గురించి తెలుసుకోవాలని నిశ్చయించుకొని తన ఆలోచనలన్నీ తన గురువుకు తెలిపాడు.

గురువు సలహామేరకు ఆ రాజు ఒక యజ్ఞం చేసి, తనకు గల సంపదనంతా ప్రజలందరికి దానం చేశాడు. కానీ, ఒక్క చక్రవర్తిత్వం మాత్రం మిగిలిపోయింది. దానిని కూడా తీసుకోమని భగీరథుడు చాలామందిని అడిగి చూశాడు. కానీ వారెవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు ఆయన తన పొరుగురాజును ఆహ్వానించాడు. అసలు విషయం తెలియగానే ఆ రాజు భయపడి, “ఓ మహారాజా! మీరు ధర్మప్రభువులు మీ స్థానానికి నేను తగను” అని తప్పించుకోబోయాడు. భగీరథుడు అతనికి మంచిమాటలు చెప్పి ఎలాగోలా తన రాజ్యం అప్పగించాడు. ఆ తర్వాత అర్థరాత్రి సమయంలో మారువేషం ధరించి ఇంకో దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా ఎవరూ గుర్తుపట్టకుండా, పగటిపూట రహస్యంగా ఉండేవాడు. రాత్రిపూట మాత్రం భిక్షమెత్తుతూ, బిచ్చగాడిలా జీవిస్తూ ఉండేవాడు.

ఇలా కొంతకాలం జరిగిన తర్వాత, తన మనస్సులో అహంకారం నశించిందనే నమ్మకం ఆయనకు కలిగింది. అప్పుడు ఆయన పగటి పూటకూడా భిక్షమెత్తుకోసాగాడు. కొన్నిరోజులకు తన స్వరాజ్యమైన అయోధ్యకు చేరి, అక్కడకూడా భిక్షమెత్తసాగాడు. అయోధ్యలో ఎవరూ ఆయనను గుర్తించలేకపోయారు. అందువల్ల ఆయన సరాసరి రాజు వద్దకే వెళ్ళి భిక్షవేయమని అడిగాడు. ఇంతలో అక్కడ ఉన్న ద్వారపాలకుడు ఒకడు పోలికలను బట్టి, కంఠస్వరం బట్టి భగీరథ మహారాజును గుర్తించి ప్రస్తుత రాజుకు చెప్పేశాడు. ఆ రాజు భగిరథునికి వినయంగా ప్రణమిల్లి “రాజ్యం  స్వీకరించండి” అని ప్రార్థించాడు. భగీరథుడు అందుకు ఇష్టపడక, “అయ్యా! పెట్టదలచుకుంటే నాకు భిక్షం పెట్టు, లేకపోతే లేదు” అని మొండికెత్తాడు. పాపం ఆ రాజు మారు మాట్లాడలేక భిక్షం పెట్టాడు. భగీరథుడు ఎంతో సంతోషంతో ఆ భిక్ష తీసుకొని వెళ్ళిపోయాడు.

కొంతకాలానికి అయోధ్యను పాలిస్తున్న రాజు గతించాడు. అతనికి వారసులు లేరు. అందువల్ల ప్రజలందరూ వెతికి వెతికి భగీరథుడి వద్దకు వచ్చి “మా భిక్షగా మీరీ రజ్యం స్వీకరించక తప్పదు” అని గట్టిగా పట్టుబట్టారు. అప్పటికి పరమాత్మ దర్శనం పొందివున్న భగీరథుడు ప్రజల కోరికను అంగీకరించాడు.

నాడు, అప్పటిరాజు రాజ్యాన్ని స్వీకరించమన్నపుడు ఆ ప్రలోభానికి భగీరథుడు లొంగలేదు. ఆత్మనిష్ఠ కలిగినందు వల్ల, భగీరథుడు లొంగలేదు. ఆత్మనిష్ఠ కలిగినందువల్ల, భగీరథుడికి ఇప్పుడు రాజ్యం ప్రతిబంధకంగా తోచలేదు. ఇట్టి ఉదాత్తస్థితికి చేరగల మహనీయుడు కనుకనే, భగీరథ చక్రవర్తి సమస్తలోకాల హితం కోసం గంగాదేవిని భూమికి తేగలిగాడు.

ఈనాడు ఉన్నతోన్నత పదవులకు అందుకోవాలని కృషి చేసే యువకులు భగీరథ చక్రవర్తి వంటి అంతస్సారాన్ని, పరోపకార దీక్షను నేర్చుకోవాలి. అప్పుడే వారు మెచ్చుకోదగ్గ భారత యువకులవుతారు.

 

ములాధారం: ధ్యానమాలిక – సామాజిక ఆధ్యాత్మిక సశాస్త్రీయ మాసపత్రిక

Make a Comment

Make a Comment: ( 1 so far )

blockquote and a tags work here.

One Response to “అంతస్సారం”

RSS Feed for తేజస్వి Comments RSS Feed

చాలా మంచి కథ తెలియజేశారు. చాలా సంతోషంగా ఉంది


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...