English నుంచి తెలుగు నేర్చుకోవలసినది….
ఇది మీరు చదువుతున్నారంటే కచ్చితంగా తెలుగువారే అయివుంటారని నేను అనుకుంటాను. తెలుగులో బ్లాగు/సైట్లను నిర్వహిస్తున్నవారు, రచనలు చేసేవారు మాతృభాష మీద అభిమానము చేతనే ఆ పని చేస్తున్నారు. కని గమనించారా? తెలుగు బ్లాగుల URLలు ఆంగ్లములో ఉన్నది. కనీసం, తెలుగులో URL అంటే ఏంటని కూడా నాకు తెలియదు. అది నా పరి(దుః)స్థితి. కాని, మనకు నచ్చిన భాషలో URLలను పొందవచ్చని ఎక్కడో ఒక బ్లాగులో చదివాను. ప్రస్తుతం తెలుగుభాష యొక్క స్థితిని ఏవిధంగా మెరుగుపరచడం అని నేను ఆలోచన సల్పినప్పుడు, నేను తెలుసుకున్న కొన్ని వాస్తవాలు, భాషాభివృద్ధిపై నా అభిప్రాయములే ఈ టపా.
మనము ఒక్క ఆంగ్ల పదము కూడా వాడకుండా, కనీసం పది నిమిషాలైనా ప్రస్తుత కాలంలో తెలుగులో మాట్లాడలేమన్నది వాస్తవము. బహు కొద్దిమంది మాత్రమే సంపూర్ణంగా తెలుగులో మాట్లాడగలరు, అది కూడా కొంత పరిధి వరకే. నా విషయానికి వస్తే, నేను ఎవరితోనైనా బాగా మాట్లాడాలన్నా, ఎక్కడైనా సంభాషణలు సమర్పించాలన్నా, బ్లాగులలో వ్రాయాలన్నా, దాదాపు నా ఆలోచనలన్నింటిని మొదట ఆంగ్లములో రూపొందించుకొని తర్వాత తెలుగులో తర్జమా చేస్తుంటాను. అలాగని, నాకు ఆంగ్లముపై మంచి పట్టువుందని కాదు. ఆంగ్ల మాధ్యమంలో చదివిన మహత్యం – నాకు అటు పరాయి భాషైన ఆంగ్లమును, ఇటు నా మాతృభాషైన తెలుగును పూర్తిగా రాదు. తెలుగు బ్లాగులోకానికి నా శిరస్సు వంచి ప్రణవిల్లుతున్నాను. నా తెలుగు ఇంత మాత్రమైనా వుందంటే అది నేను ఈ బ్లాగులోకంలోనికి ప్రవేశించాకే. మా కాలేజీలో ఓ మారు ప్రసంగించిన ఒక పెద్దాయన ” మాతృభాష మీద పట్టు సంపాదించిన వ్యక్తికి, ఇతర భాషలు నేర్చుకోవడం బాగా సులువు” అని చెప్పారు. అది నిజమేనేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. నేను ప్రత్యక్షంగా చూచిన ఆంగ్లములో మంచి వక్తలైన వారు, వారి మాతృభాషలో కూడా మంచి ప్రవీణులే.
సుమారు 200 కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎదో మేరకు ఆంగ్లము వాడుతున్నారు. 90 శాతం అంతర్జాతీయ వ్యవహారాలు ఆంగ్లములోనే నడుస్తున్నాయి. ప్రపంచం మొత్తం మీద కంప్యూటర్లలో నిక్షిప్తమైన సమాచారం అధికశాతం ఆంగ్లములోనే ఉన్నది. ఇంటర్నెట్ వ్యవహారాలకు వాడుతున్న భాషలలో సింహభాగం ఆంగ్ల భాషదే. అందుకే ఆంగ్లమును గ్లోబల్ లాంగ్వేజ్ అని అంటారు.
ఈ ఆంగ్ల భాష వ్యాప్తి ప్రపంచంలో చాలా భాషలను తుడచిపెట్టేస్తోందని ఎన్నో భాషలు, సంస్కృతులు ఆగ్రహిస్తున్నాయి. ఆ ఆగ్రహం రకరకాల రూపాలు తీసుకుంటున్నాయి కూడా. కాని, ఆంగ్లమునకు దొరుకుతున్న ఈ కొత్త ఆదరణకు అందరి కన్నా ముందు ఇంగ్లీష్ వాళ్ళే ఎక్కువ కలవరపడుతున్నారని ప్రఖ్యాత ఇంగ్లీష్ పండితుడు డేవిడ్ క్రిస్టల్ అన్నాడు. దీని వల్ల ఇంగ్లీషే ఎక్కువ మార్పునకు లోనయిందని ఆయన వివరాలతో నిరూపించాడు. భాషకు సంబంధించిన ప్రతి ఒక్క అంశం, స్పెల్లింగ్, లిపి, పంక్చ్యుయేషన్, గ్రామర్, పదజాలం, ఉచ్చారణ, ప్రతిదీ తీవ్ర మార్పులకు గురవుతోందని ఆయన అంటాడు. “నేనే కనుక భాషా దేవతనయ్యుంటే ఇంగ్లీష్ గ్లోబల్ భాష కావడాన్ని అనుమతించేవాణ్ణి కాను. ముఖ్యంగా దాని స్పెల్లింగ్ ప్రవర్తన వల్ల” అన్నాడాయన. మరి గ్లోబల్ లాంగ్వేజీ హోదా అనుభవిస్తున్న ఆంగ్ల భాష గురించి, ఇంగ్లీషువారే ఇంతగా ఆవేదన చెందుతుంటే.. మన భాషను ఇలాగే వదిలేస్తే చిన్నాభిన్నం అయిపోతుందని తెలిసి కూడా మనము దానిని అలాగే వదిలేద్దామా?
ప్రపంచంలో నూటికి డెబ్భై మంది పుట్టుకతోటే కనీసం రెండు భాషలకు వారసులుగా పుడతారని భాషావేత్తలంటారు. మా చిత్తూరులో ఇది బాగా గమనించవచ్చు. చిత్తూరులో పుట్టి పెరిగిన దాదాపు అందరికి తెలుగును, తమిళమును తెలుసు. మరికొందరికైతే హింది, కన్నడం కూడా వచ్చు. ఆంగ్లము గురించి చెప్పనవసరం లేదనుకుంటా. పట్టుమని 5వ తరగతి వరకు కూడా చదువుకోని పక్కనింటి పిన్నిగారు, ఎదురింటి ఆంటీగారు కూడా సరిగ్గా రాని ఇంగలిపీషును తెలుగుతో కలిపి మాట్లాడేస్తుంటారు.
ఇంగ్లీష్ పదజాలంలో అయిదో వంతు మాత్రమే ఆంగ్లో-శాక్సన్ పదాలున్నాయి. తక్కిన నాలుగు వంతులు సుమారు 350 భాషల నుంచి తెచ్చుకున్న అరువు పదాలే. కానీ, ఇంగ్లీష్ భాషా వ్యవహారాన్ని నిర్దేశించే కీలక పదాలు మాత్రం ఆ అయిదో వంతు సాంప్రదాయక పదాలే. అంటే, ఇంగ్లీష్ మనకొక పాఠం చెప్తోంది. ఏ భాషైనా కూడా తన కీలక నిర్మాణాన్ని నష్టపోకుండానే వివిధ భాషల పదజాలాన్ని తనలో ఇముడ్చుకోగలదని, అది ఆ భాషవ్యాప్తికే దోహదం చేస్తుందనీ. ప్రస్తుతం అటువంటి ప్రయత్నాలే తెలుగువారు కూడా చేపడుతున్నారు. నెట్లో పలుచోట్ల కంప్యూటరు, సాంకేతికంశాలకు సంబంధించిన పలు పదాలను ఆంగ్లములో కాకుండా తెలుగులోనే వాడే ప్రయత్నం చేస్తున్నారు. పలు వస్తువులకు, విషయములకు తెలుగులో నామకరణం చేస్తున్నారు.
సుమారు నూట యాభయ్యేళ్ళ కిందట ప్రింటింగ్ ప్రెస్ ప్రవేశించినప్పుడు మూడవ ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా భారతదేశంలో సాంప్రదాయక భాషలు పెద్ద కుదుపునకు లోనయ్యాయి. జనం మాట్లాడుకునే భాషను అచ్చు యంత్రం స్వీకరించకుండా అడ్డు పడడానికి సాంప్రదాయక భాషావేత్తలు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశారు. భాషను స్థిరీకరించడం, ప్రామాణికీకరించడం నాటి ఉద్దేశం. వాళ్ళను ప్రతిఘటించిన భాషావేత్తలు వ్యతిరేకించింది అటువంటి స్థిరీకరణ ప్రయత్నాలనే. అప్పట్లో తమను ఒక కుదుపు కుదిపిన ఇంగ్లీష్ మీద వందేళ్ళ తరువాత ఇప్పుడు ఆ భాషలు ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. ఫలితంగా ఇప్పటి ఇంటర్నెట్ యుగంలో ఇంగ్లీష్ భాష ముక్కలు ముక్కలుగా చీలిపోయింది.
తెలుగును పునరుద్ధరించి, తెలుగు భాష వాడుకను ప్రోత్సహించే ఈ ఉద్యమంలో తెలుగును ప్రేమించేవారందరు పాలుపంచుకునే ఆవశ్యకం ఎంతైనా వున్నది. ఈ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనకున్నా తెలుగు భాష/సాషిత్యం పై పట్టు సాధించే ప్రయత్నం చేయడం, మన నిత్య జీవిత విధులలో వీలైనంత వరకు తెలుగునే వాడడం, మన ఆప్తులైన వారిని కూడా తెలుగులోనే మాట్లాడించే ప్రయత్నం చేయడం ద్వారా పరోక్షంగా మన సాయం అందించిన వారమవుతాము.
తెలుగు అధికార భాషా సంఘం ఒకటుందని నాకెరుగు. ఆ సంఘం కూడా కాస్త ప్రోత్సాహం పుచ్చుకొని, ముందుకు సాగి, తెలుగు భాషాభివృద్ధికై పాటుపడువారందరికి ఓ వేదిక కలించడం మరియు తెలుగు భాషలో క్రొత్తగా చేసిన మార్పులను, నూతనంగా ప్రవేశపెట్టిన అంశాలను, పదాలను మరియు వాటి వాడుకను జన బాహుళ్యానికి తీసుకెళ్ళే ప్రయత్నం చేయటం జరగాలి.
తెలుగుకు జోహార్లు. తెలుగు తల్లికి జేజేలు.





చాలా మంచి ఆలోచనలే. ఇటీవల తెలుగు బ్లాగుల్లోనూ, తెలుగు బ్లాగు గుంపులోనూ ఈ విషయమై కొంత చర్చ జరిగింది. చూశారా?
కొత్తపాళీ
నవంబరు 23, 2009
@ కొత్తపాళీ గారు,
ధన్యవాదములు. కొన్ని రోజులుగా తెలుగు బ్లాగులోకంలో జరుగుతున్న చర్చలను, సమయభావన వలన గమనించలేకపోతున్నాను. చర్చ విశేషాలు కాస్త అందించగలరని మనవి.
saipraveen
నవంబరు 24, 2009
మీరు చెప్పింది నిజం. మనమందరం కలసి కృషిచేస్తే సాధించలేనిది ఏదీ లేదు .
సాధనమున పనులు సమకూరు ధరలోన .
ఇది గుర్తుపెట్టుకుందాం మనమందరం .
నరసింహారావు మల్లిన
నవంబరు 24, 2009
నరసింహారావు గారు,
మంచి మాట చెప్పారు.
saipraveen
నవంబరు 24, 2009
చాలా బాగా రాశారు. లక్షలాది తెలుగు బాషా భిమానుల ఆవేదనను ప్రతిబిబించింది మీ వ్యాసం. నిజానికి తెలుగు పునరుద్ధరణకు వ్యక్తులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూనుకున్నప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయి. ఇందుకు మన పోరుగుననే వున్నా తమిళ నాడు ఒక చక్కని ఉదాహరణ.
అధికారాలు లేని- సరైన మందీ మార్బలం లేని-కనీస ఆర్ధిక పరిపుష్టి లేని ఒక తెలుగు అధికారా భాషా సంఘం (ఇప్పుడు దానికి కూడా ఏడాదిగా తాళం కప్పు వేలాడుతోంది ) …. సచివాలయం ముందర దిష్టి బొమ్మలా నిలబెట్టిన ఒక తెలుగు తల్లి విగ్రహం….. అసందర్భంగా అనవసరపు జీవో ద్వారా రచ్చ రచ్చ అయిన ఒక మా తెలుగు తల్లి పాట…. ఇవి మాత్రమె తెలుగును ఉద్ధ రించలేవు.
తెలుగు భాషాభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ వుండాలి. బడ్జెట్ కేటాయింపులు వుండాలి. “గాంధీ భవన్”, “తెలంగాణా భవన్”, “ఎన్టీఆర్ భవన్” స్థాయిలో తెలుగు భాషా అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక “తెలుగు భవనం” వుండాలి. అందులో భాషావేత్తలకు, తెలుగు సాఫ్ట్ వేర్ నిపుణులకు, ప్రయోగాలకు, శిక్షణకు కావలసినన్ని సౌకర్యాలు వుండాలి. ప్రభుత్వ వ్యవహారాలు, జీవోలు, దరఖాస్తు ఫాం లు, నియమ నిభందనల పుస్తకాలు అన్నీ తెలుగు లో వచ్చేట్టు చూడాలి. వ్యక్తులుగా ఎవరికీ తోచిన విధంగా వారు తెలుగు భాషాభి వృద్ధికి కృషి చేస్తూనే పై చర్యల అమలు కోసం ప్రభుత్వం మీద, ఎం ఎల్ ఎ ల మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు మనమంతా ఉద్యమ స్థాయిలో చేయాల్సిన అవసరం వుంది.
నా దృష్టిలో ఆంద్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలు గానో, మూడు రాష్ట్రాలు గానో విడిపోయినప్పుడే మన తెలుగు కు పట్టిన సంకెళ్ళు తెగిపోయి, ఏలిన నాటి పాలకుల శని వదిలి మన తెలుగు భాష పోటీ పడుతూ మరీ సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుంది!!!
Prabhakar Mandaara
నవంబరు 24, 2009
ప్రభాకర్ గారు, మంచి సూచనలు ఇచ్చారు. కాని, తెలుగు అభివ్రద్ధి కొరకు తెలుగు రాష్ట్రం భాగాలుగా విడిపోవాలని మీరు చెప్పడం సరి కాదని అనుకుంటున్నాను. పోటీతత్వం అలవరచుకోవడానికి విడిపోవాల్సిన అవసరం లేదని అనుకుంటా. కావాలంటే, వర్సిటీల మధ్య పోటీలను నిర్వహించవచ్చు. కళాశాల మధ్య పోటీలను నిర్వహించవచ్చు. ఇంకా తెలుగు కోసం పాటుపడే పలు సంస్థల మధ్య పోటీలను నిర్వహించవచ్చు. కాని, ఆరోగ్యవంతమైన పోటీని మాత్రమే ప్రోత్సహించాలు. భేషజాలకు పోకుండా, కేవలం తెలుగు కొరకు మాత్రమే పోటీలను నిర్వహించాలి. అలా చేయగలిగితే మంచిదే.
saipraveen
నవంబరు 24, 2009
College – Bommarillu,
Student – Sainikudu,
Class – Appudappudu,
Exams – Anukokunda Oka roju,
Q: Paper – Aparichitudu,
Mathematics – Garshana,
Copy – Okarikokaru,
Slips – Apadhbandavudu,
Results – Adrustam,
Pass – Student No:1,
Fail – Anthuleni Kadha,
Supplemantry – Nuvvastanante Nenodhantana,
1st year – Budhimanthudu,
2nd Year – Kantri,
3rd Year – Pokiri,
4th Year – Deshamuduru,
PARENTS enquire about marks – Aa okkati Adakku…!
RIYAZ
డిసెంబరు 3, 2010