విషాదము నుంచి జనించిన కవిత
యథావిధిగా నేను రెండు రోజుల క్రిందట వేలూరుకు వెళ్తుండగా అక్కడ చోటుచేసుకున్న ఒక సంఘటన నన్ను కుదిపేసింది. బైకు నడుపుతున్న ఒక వ్యక్తి బస్సు చక్రం క్రింద పడి, ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. అతని తల నుజ్జుగా నలిగి, మొదడు బయటికి చొచ్చుకు వచ్చి, క్రొన్ని ఎముకలు విరిగి చెల్లా చెదురుగా పడి వుండడం చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను. రక్తపు మడుగులో అతను పడి వున్న దృశ్యాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకున్నాను. ఆ సంఘటన ఎలా చోటు చేసుకున్నదని, ఎవరు దానికి బాధ్యులని విచారించే సాహసం నేను చేయలేకపోయాను.
చాల్రోజులుగా స్వంతముగా ఒక కవిత వ్రాయాలని తలచే వాడిని. కాని, ఈ విషాదం నన్ను కవిత వ్రాసే దిశగా ప్రేరేవిస్తుందని నేను ఎన్నడూ ఊహించలేదు. మీ ముందు నా మొదటి కవితను సమర్పిస్తున్నాను….
బైకుపై విచ్చలవిడిగా విహరించకు
రోడ్డు నీవొక్కడి సొత్తు కాదు
నీతోడు మరికొందరుంటారు
నీవక్కడ ఒంటరివి కావు
నలుగురితో వెళ్తున్నప్పుడు పద్ధతులను పాటించు
వాటిని పాటించడం నీకు శ్రీరామ రక్షని భావించు
ఈ ఘటన నీ గడుసుతనానికి గొడ్డలిపెట్టు
నీ ప్రవర్తనకు ఇది పరాకాష్టని తలచు
ఈ ప్రమాదములో నీవొక్కడివే చనిపోయావని అనుకోకు
నీతోడు నిన్ను కన్నవారి మనసును కూడా చంపావని ఎరుగు
పైన నేను వ్రాసిన పంక్తులు కవితనే నేను భావిస్తున్నాను. దానిలో ఏమైనా లోపాలుంటే నామీద దయవుంచి సవరించగలరు. మీ విలువైన సలహాలు నన్నింకా మెరుగుపరుస్తాయని నా ప్రగాఢ నమ్మకం. నేను ఈ బ్లాగు మొదలుపెట్టిన క్షణము నుంచి ఇంతవరకు చాలా నేర్చుకోగలిగాను. నా మాతృభాషకు మరింత చేరువైయ్యాను. కాని నా మొదటి కవిత ఇలా విషాదములోంచి జనిస్తుందని నేను కలలో కూడా తలవలేదు. ఆ దుర్ఘటనలో మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ శాంతించాలని, అతని ఆత్మీయులకు అతను లేని లోటు కానరాకూడదని మరియు మిగిలిన వారందరికి ఈ సంఘటన ఒక గుణపాఠముగా వుండాలని ఆశిస్తున్నాను.
Read Full Post | Make a Comment ( 4 వ్యాఖ్యలు )