Archive for ఆగస్ట్ 16th, 2009
మన్మోహనుడి దేశ(స్వామి) భక్తి
మన్మోహనుడి దేశ స్వామి భక్తి:
నిన్న ప్రొద్దున, స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రధాని జెండా ఆవిష్కరణ మరియు దేశ ప్రజలకు అందించే సందేశాన్ని చూడాలని దూరదర్శన్ ఛానల్ పెట్టాను. జెండా ఆవిష్కరణ మరియు పెరేడ్ను చూడలేకపోయాను, అయినా నేను చాలా ఆసక్తిగా ఎదురుచూచిన ప్రధాని సందేశ సమయానికి t.v. పెట్టానని ఆనందించా. చిన్నప్పుడు మా నాన్న మన్మోహన్ సింగ్ 90లలో విత్తమంత్రి గా పనిచేసిన రోజులలో ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు చాలా కీలకమైనవి అని చెప్పారు. అప్పటి నుంచి నాకు ఆయన మీద ఒక ప్రత్యేక అభిమానం ఏర్పడింది. కాని, నిన్నటి సందేశాన్ని విన్నాక ఆయన మీద నాకున్న అభిమానం నీవా నదిలో కొట్టుకుపోయింది.
“నాకు మరల ఈ అవకాశాన్ని ఇచ్చిన భారత దేశ ప్రజలకు ధన్యవాదములు. గడిచిన సార్వభౌమిక ఎన్నికలలో ప్రజలు సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. గాంధీ, ఇందిరమ్మ మరియు రాజీవ్ చూపిన బాటలో నడుస్తూ, వారి కలను నెరవేర్చడానికి కట్టుబడి వున్నా”మని ప్రధాని తన సందేశాన్ని మొదలుపెట్టారు. నాకైతే ఆయన మాటలలో దేశభక్తి కన్నా స్వామిభక్తి పాళ్లు ఎక్కువ కనిపించింది. నెహ్రూ కుటుంబం మన దేశానికి చేసిన మేలు కంటే, నష్టమే ఎక్కువ. తెల్లవాళ్ళు కూడా మనకు రైళ్ల రవాణా వ్యవస్థను అందించారు, కొన్ని పెద్ద పెద్ద డాం లను, బ్రిడ్జిలను నిర్మించారు. కాని, అవన్నీ వారి స్వార్థ నిమిత్తం చేసారు. అంతమాత్రాన వాళ్ళు మనకు మేలు చేసారని భావిస్తామా? అప్పుడు తెల్లదొరలైతే, ఇప్పుడు నల్లదొరలు దోచుకుంటున్నారు. స్వాతంత్ర్యయానికి ముందు-తర్వాత కు తేడా ఇదే. మన రాజకీయాలు ఒక కుంటుంబ వ్యాపారంగా, పెత్తందారీతనంగా తయారవడానికి బీజం వేసినది, పెంచి పోషించినది నెహ్రూ కుటుంబమే. నెహ్రూ కుటుంబీకుల పేర్లకు గాంధీ అనే తోక రావటమే ఒక ***** కథ.(ఇక్కడ నేను ‘*’లు వాడడానికి కారణం, అక్కడ సరైన పదం నాకు దొరక్కపోవడమే. మరే అర్థాలను స్పురింపచేయడానికి కాదు.)
ప్రధాని సందేశంలోని కొన్ని ముఖ్య అంశములు:
* అక్రమ సరకు నిల్వదారులను మరియు రవాణాదారులను వారించడం.
* ఎవ్వరూ ఆకలిని అనుభవించరు.
* స్వైన్ ఫ్లూ చూసి బయపడవలసిన పనిలేదు.
* ప్రతి భారతదేశ పౌరుడు సౌభాగ్యం మరియు భద్రతను అనుభవిస్తూ, గౌరవమైన జీవితాన్ని గడపాలి.
* మనకు సరపడ్డ ఆహార నిల్వలు వున్నాయి. ధాన్యం, పప్పులు మరియు నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించే ప్రయత్నం చేస్తాము.
* మురికి వాడల నిర్మూలన కొరకు రాజీవ్ ఆవాస్ యోజన.
* సోలార్ ఎనర్జీ వాడకాన్ని ప్రోత్సహించి ఊతమందించేందుకు, జవహర్లాల్ నెహ్రూ జాతీయ సోలార్ మిషన్.
* నక్సలిజానికి, తీవ్రవాదానికి చమరగీతం పలకటం.
* అణగారిన వర్గాలు, మైనారిటీల సంక్షేమం కొరకు ప్రత్యేక పథకాలు.
* అవినీతిని అంతమొందిచి, ప్రభుత్వ పథకాల ఫలాలను ప్రజలకు చేరవేయటం.
* పన్నుదారుల సొమ్ము సరిగ్గా ఉపయోగపడేలా చూడటం.
* దేశ నిర్మాణమే ప్రధాన లక్ష్యం.
ఇంకా మరెన్నో…
ప్రధాని హామీలు ఇవ్వటం ఒక విశేషమైతే, అవి మన ప్రభుత్వం ఆచరణలో పెట్టలేని పనులు కావటం మరో విశేషం. అక్రమాలను ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను ప్రోత్సహించే మన ప్రభుత్వ తీరు, విభజించి పాలించు అనే తెల్లవాళ్ళ సిద్ధాంతాన్ని పాటించడం, ప్రజలకు అతి ముఖ్యమైన విద్య-వైద్య-ఆహారాన్ని అందించడానికి కావలసిన చిత్త శుద్ధి లోపించడాన్ని మనము చవి చూస్తున్న తరుణంలో ప్రధాని దేశ ప్రజలకు ధైర్యాన్ని నూరిపోస్తారని, యువతను ఉత్సాహ పరుస్తారని నేను భావించాను. కాని అది జరగలేదు. ప్రధానికి దేశ భక్తి కన్నా, స్వామి భక్తే ఎక్కువని నిరూపించుకున్నారు. ఆయన హామిలను చూస్తుంటే నాకు ముందు నవ్వోచింది, తర్వాత బాధేసింది, చివరన ఆయన మీద అసహ్యం మొదలైంది.
ఉజ్వలమైన భారతదేశ నిర్మాణం కొరకు మనమందరము పూనుకోవాలి. అందుకు రాజకీయ ప్రక్షాలనే ప్రధాన మార్గం. పవిత్ర రాజకీయాలను బురద గుంటలుగా తయారు చేసిన వారిని ఏరిపారేయాలి. మన సత్తా ఎంటో చాటాలి. జై భారతమాత!! జై హింద్!!
Read Full Post | Make a Comment ( 7 వ్యాఖ్యలు )